గురుగ్రామ్లోని అల్ట్రా-లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ డీల్ నమోదైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా.. డీఎల్ఎఫ్ సంస్థకు చెందిన ‘ది డాలియాస్’ ప్రాజెక్టులో ఓ పెంట్హౌస్ను ఏకంగా రూ.271 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దేశంలో అత్యంత ఖరీదైన సింగిల్-హోమ్ ప్రాపర్టీ లావాదేవీల్లో ఈ కొనుగోలు కూడా ఒకటిగా నిలిచింది.
17,200 చదరపు అడుగుల విలాసవంతమైన పెంట్హౌస్
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లోని సెక్టార్-54లో ‘ది డాలియాస్’ ప్రాజెక్టు ఉంది. ఇందులో మానవ్ సర్దానా కొనుగోలు చేసిన పెంట్హౌస్ సూపర్ ఏరియా సుమారు 17,200 చదరపు అడుగులు. కార్పెట్ ఏరియా దాదాపు 10,500 చదరపు అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.
డీల్ విలువను బట్టి చూస్తే.. సూపర్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ఆధారంగా దాదాపు రూ.2.6 లక్షలు చెల్లించినట్లవుతుంది. దీంతో గురుగ్రామ్ లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో ధరల స్థాయిపై మరోసారి చర్చ మొదలైంది.
ఎవరీ మానవ్ సర్దానా?
మానవ్ సర్దానా ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందిన ప్రముఖ సర్దానా వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆటోమొబైల్ రంగంలో పేరున్న ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ సంస్థతో ఈ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది.
మానవ్ సర్దానా తండ్రి ఎస్బీ సర్దానా 1969లో ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ను స్థాపించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన పరికరాల తయారీలో సంస్థ కీలకంగా ఎదిగింది. అనంతరం గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ ఈ కంపెనీలో వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మానవ్ సర్దానా గ్రూప్కు చెందిన పలు సంస్థల్లో డైరెక్టర్గా కొనసాగుతున్నట్లు సమాచారం.
‘ది డాలియాస్’ ప్రత్యేకత ఏంటి?
డీఎల్ఎఫ్ 2024 అక్టోబర్లో ‘ది డాలియాస్’ ప్రాజెక్టును ప్రారంభించింది. గురుగ్రామ్ డీఎల్ఎఫ్ ఫేజ్-5లో సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో సుమారు 420 అపార్ట్మెంట్లు, పెంట్హౌస్లు ఉండనున్నాయి. సాధారణ అపార్ట్మెంట్ల ధరలు సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకు ఉండగా.. పెంట్హౌస్ల ధరలు దీనికంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా రూ.40 వేల కోట్లకు పైగా అమ్మకాలను సాధించాలని డీఎల్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాజెక్టులోని సుమారు 65 శాతం యూనిట్లు విక్రయమైనట్లు పీటీఐ నివేదికలు వెల్లడించాయి.
లగ్జరీ హౌసింగ్కు పెరుగుతున్న డిమాండ్
కరోనా తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గురుగ్రామ్, ముంబై వంటి నగరాల్లో అధిక సంపద కలిగిన కొనుగోలుదారులు పెద్ద విస్తీర్ణం, ప్రత్యేకమైన సౌకర్యాలు, ప్రైవసీ ఉన్న ప్రీమియం నివాసాల వైపు ఆసక్తి చూపుతున్నారు.
రూ.271 కోట్ల పెంట్హౌస్ కొనుగోలు ఈ ట్రెండ్కు మరో ఉదాహరణగా నిలిచింది. గురుగ్రామ్లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ఈ భారీ డీల్ స్పష్టం చేస్తోంది.
also read: లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. భారత్పై సంచలన వ్యాఖ్యలు
