Homeజాతీయందేశంలో విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు ఐఎస్ఐ కుట్ర.. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్!!

దేశంలో విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు ఐఎస్ఐ కుట్ర.. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్!!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : దేశంలో విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI) పన్నిన మరో భారీ కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఐఎస్ఐ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్న ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించిన పోలీసులు, మరో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌తో దేశంలోని భద్రతా సంస్థలు, ముఖ్యంగా పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పాక్ మద్దతుతో నడుస్తున్న ప్రమాదకర నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన వారిలో సోహెల్, సోను మీనా, సచిన్ కుమార్ మీనా, మహమ్మద్ కైఫ్, మహమ్మద్ రిహాన్ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఐదు పిస్టళ్లు, పది తూటాలు, పాకిస్తాన్ అనుకూల పోస్టర్లు, అభ్యంతరకర వీడియోలు, మొబైల్ ఫోన్లలో భద్రపరిచిన నిఘా దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహ్‌జాద్ భట్టీ ఈ ముఠాను నడిపిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా భారతీయ యువతను ఆకర్షించి, వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్లించడం ఈ నెట్‌వర్క్ ప్రధాన లక్ష్యంగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లు, భద్రతా శిబిరాలు, కీలక ప్రభుత్వ సంస్థలపై నిఘా పెట్టాలని వీరికి ఆదేశాలు అందినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా పోలీసు అధికారులనే లక్ష్యంగా చేసుకుని ‘టార్గెట్ కిల్లింగ్స్’కు ప్రణాళికలు రచించినట్లు అధికారులు వెల్లడించారు. పలు పోలీస్ స్టేషన్ల రెక్కీ వీడియోలు పాకిస్తాన్‌కు పంపినట్లు గుర్తించారు. ఈ వీడియోల ఆధారంగా భవిష్యత్ దాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.

ఇక “తహ్రీక్-ఏ-తాలిబాన్ హిందుస్తాన్ (TTH)” పేరుతో దేశంలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం, వాటి వీడియోలను చిత్రీకరించి పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు పంపడం వంటి పనులకు నిందితులకు డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇదే మాడ్యూల్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో విద్రోహ చర్యలకు పాక్ ఐఎస్ఐ ప్రోత్సాహం అందిస్తున్న మరో నెట్‌వర్క్‌ను బయటపెట్టిన ఈ ఆపరేషన్‌తో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి. అరెస్టయిన నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు