Shocking Incident in Aligarh: ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతని స్నేహితులే దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఈ నెల 15న జరిగినప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చింది.
మద్యం డబ్బుల కోసం మొదలైన గొడవ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీగఢ్ జిల్లా షాపూర్ కుతుబ్ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కలిసి మద్యం తాగేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం డబ్బులు ఇవ్వాలని ఒక యువకుడిని వారు అడిగినట్లు తెలుస్తోంది. అయితే అతడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మొదట చిన్నపాటి గొడవగా ప్రారంభమైన వివాదం క్రమంగా హింసాత్మకంగా మారింది. కోపంతో ఊగిపోయిన మిగతా యువకులు కలిసి బాధితుడిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడి తలపై సుత్తితో మేకును కొట్టినట్లు సమాచారం. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్న విషయానికి స్నేహితులే ఇలా ప్రాణాల మీదకు రావడం చూసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో జరిగే గొడవలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ ఘటన మరోసారి చూపించింది. యువతలో పెరుగుతున్న హింసాత్మక ధోరణిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.