దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే మే 23వ తేదీ నాలుగో శనివారం, మే 24వ తేదీ ఆదివారం సెలవులు ఉండటంతో, 25, 26 తేదీల్లో సమ్మె కలిపి వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్రాంచులు మూతపడనున్నాయి. ఈ పరిణామం కోట్లాది ఖాతాదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశముంది.
బ్రాంచ్కు సంబంధించిన సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్లు, లోన్లకు సంబంధించిన ఫిజికల్ డాక్యుమెంట్ల సమర్పణ వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. బ్యాంక్ ద్వారా నేరుగా జరిగే అన్ని పనులు ఈ నాలుగు రోజుల పాటు నిలిచిపోవడంతో, అత్యవసర లావాదేవీలు ఉన్న కస్టమర్లు ముందుగానే వాటిని పూర్తి చేసుకోవడం అవసరం. అలాగే బ్యాకెండ్ ప్రాసెసింగ్కు సంబంధించిన పనులు కూడా ఆలస్యం కావచ్చు.
ఈ సమ్మెకు ప్రధాన కారణంగా ఉద్యోగులు తమ 16 డిమాండ్లను ముందుకు తెచ్చారు. బ్యాంకులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో వెంటనే కొత్త నియామకాలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడం, వేతన వ్యత్యాసాలను తొలగించడం, వైద్య ప్రయోజనాలను మెరుగుపరచడం వంటి అంశాలు కూడా ఈ డిమాండ్లలో ఉన్నాయి. పని పరిస్థితులను మెరుగుపర్చాలని ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది.
ఇక పెన్షన్ వ్యవస్థలో మార్పులు కూడా ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటిగా నిలిచాయి. జాతీయ పెన్షన్ వ్యవస్థలో మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు మెరుగైన లాభాలు ఇవ్వాలని కోరుతున్నారు. పెన్షన్ లెక్కింపు విధానంలో మార్పులు, ఉద్యోగుల కెరీర్ అభివృద్ధికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలను కూడా వారు ప్రస్తావించారు. ఈ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెకు పిలుపునిచ్చారు.
అయితే, బ్రాంచ్ సేవలు నిలిచిపోయినా, డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయి. అయినప్పటికీ, పెద్ద మొత్తాల లావాదేవీలు లేదా డాక్యుమెంట్ సంబంధిత పనులు ఉన్న కస్టమర్లు ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ:Football Lily: పదేళ్ల నిరీక్షణ, ఐదు అరుదైన పుష్పాలు!