అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో కొనసాగుతున్న ఒక విశిష్ట సంప్రదాయం భక్తి, ఆచారం, విశ్వాసాల సమ్మేళనంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. సాధారణంగా బాల్య వివాహం చట్టవిరుద్ధంగా భావించినప్పటికీ, ఇక్కడ జరిగే ఈ వేడుక పూర్తిగా దైవ సంబంధిత ఆచారంగా నిర్వహించబడుతోంది. రాయదుర్గంలో జరిగే శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దాదాపు 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం 10 ఏళ్ల బాలికతో స్వామివారికి ప్రతీకాత్మకంగా వివాహ వేడుక నిర్వహించడం విశేషం. ఈ ఏడాది కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి శ్రీ స్వర జాహ్నవితో వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో భాగంగా పెళ్లికూతురిని ముందుగా మార్కండేయ స్వామి ఆలయం నుంచి మేళతాళాలతో రాయదుర్గం కోటలోని శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు. సంప్రదాయ పద్ధతుల్లో జీలకర్ర, బెల్లం పెట్టించి, కన్యాదానం నిర్వహించి, వేద మంత్రాల మధ్య కళ్యాణం జరుపుతారు. పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించే ఆచారం నిర్వహించిన అనంతరం, ఆ మంగళసూత్రాన్ని పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కట్టడం ఈ వేడుకలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది. ఈ విధంగా జరిగే ఈ దైవ వివాహం ప్రతీకాత్మకమైనదిగా భావించబడుతుంది.
పద్మశాలి వంశానికి చెందిన అరవ తెగ బాలికతో స్వామివారికి వివాహం జరిపిస్తే, ఆ చిన్నారి భవిష్యత్తులో ఉత్తమ గుణగణాలు కలిగిన భర్తను పొందుతుందని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసంతోనే ప్రతి సంవత్సరం ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ అద్భుత వేడుకను వీక్షించేందుకు రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు సమీప కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తి భావంతో నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ఈ సంప్రదాయం అనాదిగా కొనసాగుతుండగా, ఆలయ అర్చకులు దీన్ని పరంపరగా కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. తమ కుమార్తెకు దేవుడితో కళ్యాణం జరగడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుక భక్తి, సంప్రదాయం, విశ్వాసం కలిసి ఉన్న అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది.
ASLO READ: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు వరుసగా బంద్