తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు, పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప్రభుత్వానికి పలు కీలక విజ్ఞప్తులు చేశారు. న్యూఢిల్లీలో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో తెలంగాణ విద్యార్థులు వెళ్తున్న నేపథ్యంలో.. వారికి వీసా అపాయింట్మెంట్లు త్వరగా లభించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చే సమయంలో ముందస్తు సమాచారం అందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నిబంధనలు సులభతరం చేస్తే నైపుణ్యం కలిగిన నిపుణులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను కూడా సీఎం వివరించారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు.
అలాగే అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేలా సహకారం అందించాలని సీఎం కోరారు. విద్య, సాంకేతిక రంగాల్లో పరస్పర భాగస్వామ్యంతో రెండు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ భాషల్లో తెలుగు కూడా ఒకటిగా ఉందని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు.
also read: హైదరాబాద్లో నకిలీ ఎన్ఓసీల స్కాం- హైడ్రా రంగనాథ్ తో పాటు ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ
