ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ సంరక్షణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఏనుగుల రక్త నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షల కోసం డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. అక్కడ పరీక్షలు పూర్తయ్యాక వచ్చే వివరాల ఆధారంగా ప్రతి ఏనుగుకు ప్రత్యేక గుర్తింపు కార్డు సిద్ధం చేసి వాటికి తగిలించనున్నారు. ఈ కార్డుల్లో ఏనుగు ఆరోగ్యం, వంశ పరంపర, జన్యు లక్షణాలు వంటి పూర్తి సమాచారం నమోదు చేయనున్నారు. భవిష్యత్తులో వైద్య చికిత్సలు, జన్యు సంబంధిత సమస్యల పరిష్కారం, ఆరోగ్య పర్యవేక్షణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 6 కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఏనుగులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో సంరక్షిస్తున్నారు. ఈ ఏనుగులకు వినయ్, రంజన్, జయంత్, దేవ, అభిమన్యు, కృష్ణ అనే పేర్లు కూడా పెట్టారు. వీటి ఆరోగ్యం, సంరక్షణను మరింత మెరుగుపరచేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డుల ఆలోచనను అమలు చేస్తున్నారు.
ఈ కుంకీ ఏనుగులు అటవీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అడవుల్లో తిరిగే అడవి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం వీటి ప్రధాన బాధ్యత. ప్రత్యేక శిక్షణతో వీటిని సిద్ధం చేయడంతో, అడవి ఏనుగులను తిరిగి అడవుల వైపు మళ్లించే సామర్థ్యం వీటికి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాలు, పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా నియంత్రించడం ద్వారా ప్రజలకు పెద్ద ఊరట కలుగుతోంది.
ఇక ఈ ఏనుగుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాటి కోసం ప్రత్యేక సహాయకులు, శిక్షకులను నియమించి, ఆహారాన్ని కూడా ప్రత్యేకంగా అందిస్తున్నారు. భారీ బరువులను మోయగల సామర్థ్యం ఉన్న ఈ కుంకీ ఏనుగులు అటవీ ప్రాంతాల్లో కష్టతరమైన పనులను సులభంగా నిర్వహించగలవు. అటవీ అభివృద్ధి, సంరక్షణ కార్యక్రమాల్లో ఇవి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి గణనీయమైన వ్యయం కూడా చేస్తోంది.
ASLO READ: దైవ సంకల్పం!.. పదేళ్ల బాలికకు పెళ్లి.. బాల్య వివాహం అనుకోకండి!