Shocking Scene at Odisha Bank: ఒడిశాలో మనసును కలిచివేసే ఘటన జరిగింది. కియోంఝర్ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా అనే వ్యక్తి, తన సోదరి మరణించిన విషయాన్ని నిరూపించడానికి చేసిన పని అందరినీ షాక్కు గురిచేసింది. జీతూ సోదరి కాల్రా ముండా కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు భర్త, కుమారుడు లేరు. మరణానికి ముందు, తన బ్యాంక్ ఖాతాలో ఉన్న కొద్దిపాటి డబ్బును తీసుకోవాలని తన సోదరుడికి చెప్పింది. ఆ చెప్పినట్లుగా జీతూ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, బ్యాంక్ అధికారులు ఖాతాదారు హాజరు కావాలని లేదంటే మరణ ధృవీకరణ పత్రం చూపించాలన్నారు.
అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన జీతూ
నిరక్షరాస్యుడైన జీతూ తన దగ్గర అలాంటి పత్రాలు లేకపోవడంతో, పలుమార్లు వెళ్లినా డబ్బు ఇవ్వలేదు. చివరకు విసుగు చెందిన అతను, తన సోదరి మరణాన్ని నిరూపించడానికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. శ్మశానవాటికకు వెళ్లి, ఆమె సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీసి, భుజాన వేసుకుని సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్లాడు. “ఇదిగో నా అక్క అస్తిపంజరం… ఇప్పుడు అయినా నమ్ముతారా?” అని ప్రశ్నించాడు. ఈ సంఘటనతో బ్యాంకు సిబ్బంది, అక్కడున్న వారు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి అస్తిపంజరాన్ని తిరిగి సమాధి చేశారు.
అధికారులు ఏం చేశారంటే?
ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో, వెంటనే చర్యలు తీసుకున్నారు. కాల్రా ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును వడ్డీతో కలిపి జీతూకు అందజేశారు. అదనంగా, రెడ్క్రాస్ నిధి నుంచి అతనికి సహాయంగా రూ.30,000 కూడా ఇచ్చారు. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.