-
పార్టీ కార్యవర్గాలను రద్దు చేసిన కేసీఆర్
-
యువరక్తం ఎక్కించేందుకు ప్రణాళిక
-
పార్టీ పూర్వవైభవం దిశగా గులాబీ బాస్ అడుగులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్ కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నేతలందరి పదవులను తీసేశారు. కార్యవర్గాలను పూర్తిగా రద్దు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ ఈ అనుష నిర్ణయం తీసుకోవడం విశేషం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర, జిల్లా కార్యవర్గ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కేసిఆర్ ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. వచ్చే ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పనిచేసే నాయకులకు పెద్దపీట..
ప్రధానంగా బిజెపితో పొత్తు అనే ప్రచారం పతాక స్థాయికి చేరుతోంది. ఇంకోవైపు పార్టీలో కేటీఆర్ వ్యవహార శైలి పై చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ రాష్ట్రంతో పాటు జిల్లాల కార్యవర్గాలన్నింటినీ రద్దు చేయడం మాత్రం చూస్తుంటే కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో కొత్త రక్తం ఎక్కించే లక్ష్యంతోనే ఈ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు అర్థం అవుతోంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే యువతను, కష్టపడే నాయకులకు కొత్త కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, నేతల పనితీరుపై ఇప్పటికే అందిన నివేదికల ఆధారంగా మార్పులు చేయనున్నారు. పదవుల్లో ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టనున్నారు. పార్టీ కోసం పనిచేసే నిలబడే వారికి ఇకనుంచి పెద్ద పీట వేయనున్నారు.
కవిత పార్టీ వైపు వెళ్లకుండా కట్టడి..
ఒక విధంగా చెప్పాలంటే కెసిఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు అని అర్థం అవుతుంది. పార్టీ నుంచి కొంతమంది కవిత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు నూతన కమిటీలను ప్రకటించడంతో పాటు రాష్ట్రస్థాయిలో కీలక మార్పులు చేపట్టనున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, అనుబంధ విభాగాల్లో చురుగ్గా ఉండే వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేసే సైన్యాన్ని తయారు చేయడమే ఈ ప్రక్షాళన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే నేరుగా కేసీఆర్ ఈసారి రంగంలోకి దిగడం మాత్రం ఆ పార్టీ శ్రేణులకు ఊరటనిస్తోంది. పార్టీ పూర్వ వైభవం దిశగా అధినేత అడుగులు వేసేసరికి పార్టీ శ్రేణులు కూడా ఆహ్వానిస్తున్నాయి. ఇకనుంచి ప్రజాక్షేత్రంలో నిత్యం కెసిఆర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.