కాకినాడ, క్రైమ్ మిర్రర్ః కాకినాడ జిల్లాల్లో ఒక్కసారిగా వంద మీటర్లు సముద్రం వెళ్లిన అరుదైన ఘటన స్థానికులను, పర్యాటకులను అశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఉప్పాడ తీరంలో సముద్రం ముందుకు చొచ్చుకురావడం (సముద్ర కోత) మనం చూస్తుంటాం. కానీ, తాజాగా సముద్రం ఒక్కసారిగా సుమారు 100 మీటర్ల మేర వెనక్కి తగ్గింది. తీరం వెంబడి నీరు వెనక్కి వెళ్లడంతో అప్పటివరకు నీటి అడుగున ఉన్న ఇసుక దిబ్బలు మరియు రాళ్లు బయటపడ్డాయి.
బయటపడ్డ జియోట్యూబ్ ఆనవాళ్లు…
ఆకస్మత్తుగా సముద్రం వెనక్కి తగ్గడంతో గతంలో సముద్ర కోతను అరికట్టడానికి ప్రభుత్వం నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో అలల ఉధృతికి తీరం కొట్టుకుపోకుండా ఉండేందుకు రసాయనాలతో కూడిన భారీ ఇసుక సంచులను (జియోట్యూబ్స్) వరుసగా పేర్చి రక్షణ గోడగా నిర్మించారు. కాలక్రమేణా సముద్రం ముందుకు రావడంతో ఈ గోడ పూర్తిగా నీటిలో మునిగిపోయి కనుమరుగైంది.ఇప్పుడు సముద్రం వెనక్కి తగ్గడంతో, ఆ జియోట్యూబ్స్ మళ్ళీ బయటపడి కనిపిస్తున్నాయి.
సముద్రంలో సంభవించే పోటు-పాటులవల్ల నీటి మట్టంలో మార్పులు వస్తుంటాయి. అమావాస్య లేదా పౌర్ణమి సమయాల్లో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల అలల ఉధృతి లేదా నీరు వెనక్కి వెళ్లడం సహజంగా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు లేదా గాలుల దిశలో మార్పుల వల్ల కూడా తీరం వెంబడి నీటి మట్టం తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
స్థానికుల్లో ఆందోళన…
సముద్రం వెనక్కి వెళ్లడం చూసి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు సముద్రం ఇలాగే వెనక్కి వెళ్తుందనే భయం వారిలో ఉంది. అయితే, ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని, ఇది కేవలం సహజ సిద్ధమైన మార్పేనని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు లోపల ఉన్న గుంతలు లేదా బురదలో చిక్కుకునే ప్రమాదం ఉన్నందున పర్యాటకులు లోపలికి వెళ్లవద్దని సూచించారు. రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు తీర ప్రాంత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు.
