మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినప్పటికీ ఇరాన్ తన వ్యూహంలో ఏమాత్రం మార్పు చూపలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ప్రభావం చూపే లక్ష్యాలపై దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రెండోరోజుకూ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయన్న వార్తలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
దుబాయ్లో ఉన్న గూఢచారి వ్యవస్థ కేంద్రాలపై బాంబు దాడులు జరిగాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో దోహాలో పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా అప్రమత్త స్థితిలోకి వెళ్లింది. ప్రతీకార చర్యల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్కు చెందిన సైనిక మౌలిక సదుపాయాలపై దాడులకు దిగినట్లు సమాచారం.
ఇంకొవైపు లెబనాన్లోని అమెరికా రాయబార కార్యాలయం పరిసరాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు జరిగినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలను పెంచుతున్నాయి. గల్ఫ్ దేశాలు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా గుర్తింపు పొందిన బూర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై కూడా ఈ ఉద్రిక్త పరిణామాల్లో ప్రస్తావనకు వచ్చింది. టెహ్రాన్ నుంచి ప్రయాణించినట్లు చెబుతున్న డ్రోన్లు ఆ భవనం సమీప గగనతలంలో సంచరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో భవనం ఒక అంతస్తు వద్ద మంటలు చెలరేగినట్లు, పొగ కమ్ముకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ నిర్మాణాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా లేదా సమీప ప్రాంతాల్లో జరిగిన దాడుల ప్రభావమేనా అనే అంశంపై స్పష్టత లేదు. అధికారికంగా ఎటువంటి ధృవీకరణ వెలువడలేదు. అంతర్జాతీయ మీడియా వర్గాలు పాక్షిక నష్టం జరిగి ఉండొచ్చని కథనాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, సంబంధిత దేశాల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఈ సంఘటనలతో మధ్యప్రాచ్య ప్రాంతం మళ్లీ ఉద్రిక్తతల మంటల్లో కాగుతోంది. ఒకవైపు ప్రతీకార దాడులు, మరోవైపు సంయుక్త సైనిక చర్యలు ఇలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
