పాత పరిచయం పేరుతో నమ్మిన వ్యక్తి చేతిలో ఓ మహిళ తీవ్రంగా మోసపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. తన క్లాస్మేట్గా ఉన్న వ్యక్తి ఆమెను నమ్మించి, మత్తుమందు ఇచ్చి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి..
నాగ్పూర్కు చెందిన ఓ మహిళ 2025 ఫిబ్రవరి 8న తన పాత క్లాస్మేట్ అయాజ్ మదారేను కలవడానికి ఓ హోటల్కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఇచ్చిన కూల్డ్రింక్లో నిందితుడు మత్తుమందు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది తాగిన తర్వాత మహిళ స్పృహ కోల్పోయింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకున్న అయాజ్ ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని బయటపెడతానంటూ బెదిరించి మహిళను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బెదిరింపులతో ఆమె నుంచి సుమారు రూ.4 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.
భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు
ఇంతటితో ఆగకుండా మహిళపై మరిన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజురోజుకూ వేధింపులు పెరగడంతో బాధితురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. చివరకు తన భర్తకు విషయం చెప్పి, అతడి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అయాజ్ మదారేతో పాటు అమీన్ షేక్ అనే మరో వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అనంతరం మధ్యప్రదేశ్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నెట్టింట వీడియో వైరల్
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిందితుడు మహిళను వేధిస్తున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. వీడియోలో బాధితురాలు తనను వదిలేయాలని వేడుకుంటున్నప్పటికీ, నిందితుడు ఆమె మాటలు పట్టించుకోలేదని సమాచారం. కాగా, బాధిత మహిళ భర్త భారత వైమానిక దళంలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తున్నారు.