రక్తపోటు (బీపీ) అనేది చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. అయితే, బీపీ మందులు వాడుతున్న వారిలో తరచుగా వచ్చే సందేహం, లేదా అపోహ “ఒక రోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుందిలే” అనేది. ఈ నిర్లక్ష్యమే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ఈ విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రజలకు కీలకమైన అవగాహన కల్పించారు. బీపీ మాత్రలు వేసుకున్న ఆ రోజు మాత్రమే పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే ఒక రోజు మందు వేసుకోవడం మానేస్తే, వారి శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. ఇలా అకస్మాత్తుగా బీపీ పెరగడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.చాలామంది బీపీ కంట్రోల్ లోకి రాగానే, ఇక మందులు అవసరం లేదని తమ సొంత నిర్ణయాలతో వాటిని వాడటం ఆపేస్తుంటారని డాక్టర్ మిర్యాల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని ఆయన అన్నారు. ఎవరైనా సరే, వైద్యులు సూచించిన విధంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా బీపీ మందులు వేసుకోవాలని, సొంత వైద్యం చేసుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. వైద్యుల సలహా లేకుండా మందులు ఆపడం లేదా డోస్ మార్చడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల స్పష్టం చేశారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో, జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు.
తమిళనాడు ఆలయాల్లో మొబైల్ ఫోన్లు నిషేధం!
వినాయక చవితికి తెలంగాణ పోలీసుల సైబర్ అలర్ట్.. గణేశుడి రూపంలో కీలక సందేశం!
