హైదరాబాద్ నగరంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. లోయర్ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతంలో గురువారం సగం వరకు కాలిపోయిన మహిళ మృతదేహం చెత్తకుండీలో కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్థానికులు గమనించిన ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, దోమల్గూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహం పరిస్థితిని బట్టి మహిళను వేరే ప్రదేశంలో హత్య చేసి, ఆధారాలు చెరిపివేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి నిప్పు పెట్టి పడేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో కీలక ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. మహిళ గుర్తింపు ఇంకా తెలియరాలేదని, ఆమె ఎవరు? ఎలా ఈ ఘటనకు గురయ్యింది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: భారత వాయుసేనలో చరిత్ర సృష్టించిన భావనా కాంత్ – ‘టాప్ గన్’ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్
