భారత ప్రధాని నరేంద్రమోడీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు బెదిరింపు సందేశం రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ప్రధాని మోదీ జులై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జులై 9న మెల్బోర్న్ లో నిర్వహించే ‘మెల్బోర్న్ మీట్స్ మోడీ’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్కు సంబంధించిన పోస్టుకు ఫేస్ బుక్ లో ఒక వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. “స్టేడియం పైకప్పును మూసేయండి.. మోడీ ఈ కార్యక్రమానికి వస్తే అది మరణం వైపు వెళ్లినట్టే” అనే అర్థంలో బెదిరింపు కామెంట్ పోస్టు చేశారు.
ఈ కామెంట్ అబూ ముస్తాఫా అనే పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ పోస్టు ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ బెదిరింపును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. భద్రతా సంస్థలు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ పర్యటనలో మోడీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా-భారత్ వార్షిక సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశాల గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కీలక విషయాలు వెల్లడించారు. భారత్ తమ దేశానికి ముఖ్యమైన వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామి అన్నారు.