-
హైడ్రా తాత్కాలిక ఉద్యోగాలకు వేలాది మంది అభ్యర్థులు
-
చేతిలో డిగ్రీ పట్టాలు పెట్టుకుని వచ్చిన విద్యాధికులు
-
మరోవైపు నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం పరిశ్రమల అన్వేషణ
-
ఈ పరిస్థితి మారాలంటున్న సీఎం రేవంత్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: క్రిమినల్ వేస్ట్ చదువులు.. తెలంగాణ సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యల చుట్టూ పెద్ద రాజకీయమే నడిచింది. గులాబీ పార్టీ పెద్ద ఉద్యమం తీసుకురావాలని భావించింది. కానీ అది వర్కౌట్ కాలేదు. నిరార్ధక చదువుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అవి. కానీ నిన్న సరూర్ నగర్ స్టేడియం వద్ద హైడ్రా నిర్వహించిన 150 కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల కోసం వేలాదిమంది తరలివచ్చారు.
అక్కడ తొక్కిసలాట కూడా జరిగింది. అయితే ఇది రిక్రూట్మెంట్ వైఫల్యం కాదు. ప్రస్తుత సమాజంలో రూపుదిద్దుకున్న లోతైన విద్య – ఉపాధి మధ్య ఉన్న అంతరం. డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వేలాది మంది యువత… తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన తాత్కాలిక డ్రైవర్, అసిస్టెంట్ పోస్టుల కోసం ఎగబడటం వెనుక ఉన్న అసలు కారణం విద్యార్హతలు. మార్కెట్ కు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం అనేది ఒక చేదు నిజం. సీఎం రేవంత్ చెబుతున్నది కూడా అదే.
-
పరిశ్రమల్లో ఖాళీలు..
తెలంగాణలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కనిపిస్తోంది. అక్కడ ఉద్యోగాలు లేవు అనే మాటకు తావులేదు. ప్రతి ఐటీ కంపెనీ, తయారీ రంగం, స్టార్టప్ లు నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాయి. అయితే వారికి సరైన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరకడం లేదు.
పారిశ్రామిక వర్గాలు ఈ మాట చెబుతుంటే.. మరోవైపు డిగ్రీ పట్టాలు చేతిలో పట్టుకున్న లక్షలాదిమంది యువకులు సరూర్నగర్ స్టేడియం గేట్ల ముందు లైన్లో నిలబడ్డారు. చదువుకున్న చదువుకు.. పరిశ్రమకు కావాల్సిన ఆచరణాత్మక విజ్ఞానం మధ్య గ్యాప్ ఏర్పడడం అసలు సమస్య.
-
సీఎం రేవంత్ కామెంట్స్..
మొన్న మధ్యన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన క్రిమినల్ వేస్ట్ చదువులు అనే పదం వెనుక ఉన్న అసలు అర్థం కూడా అదే. మార్కెట్కు అవసరమైన కనీస ప్రాక్టికల్ అవగాహన లేకుండా.. కేవలం సర్టిఫికెట్ల కోసమే పూర్తి చేసే చదువులు చివరికి అభ్యర్థులను ఎటుకాకుండా చేస్తున్నాయి. నైపుణ్యాలు లేని డిగ్రీలు ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన, ఉత్పాదకత కలిగిన ఐదు నుంచి 8 సంవత్సరాల సమయాన్ని.. కుటుంబ ఆర్థిక వనరులను పూర్తిగా డైలమాలో పడేస్తున్నాయి.
సమయాన్ని, శ్రమను వృధా చేసి చివరకు ఎలాంటి మార్కెట్ వాల్యూ లేని డిగ్రీ పత్రాలను చేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఇటువంటి విద్యా విధానాన్ని క్రిమినల్ వేస్ట్ అని సంబోధించారు సీఎం రేవంత్. కేవలం ప్రభుత్వ కొలువు అన్న ఆలోచనతో.. నైపుణ్యాన్ని పక్కన పెడుతోంది నిరుద్యోగ యువత.
ప్రస్తుతం కార్పొరేట్ లేదా ప్రైవేట్ రంగంలో స్కిల్స్ చాలా అవసరం. అలా స్కిల్స్ పెంచుకునే చదువులు కంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులను పూర్తి చేస్తోంది యువత. ఇకనైనా వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేయక తప్పదు.
