క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్ధేశింకి కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు.. భవిష్యత్లో ఓటమి అనేది లేకుండా విజయాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కార్యకర్తలకు సూచించారు. తునిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కార్యకర్తలకు దిశా, నిర్ధేశం చేశారు. పార్టీయే సుప్రీమ్ అని, కార్యకర్తే నాయకుడు అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికులు మాదిరిగా పని చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి వరుస విజయాలు సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్తోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్న ఆయన.. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పార్టీని పటిష్టం చేసుకోవడంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్న ఆయన.. చిన్న చిన్న ఇబ్బందులను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని హితబోధ చేశారు. గడిచిన ఎన్నికల్లో 55.5 శాతం ఓట్ల కంటే మరింత ఎక్కువ ప్రజాధరణ సాధించేలా కృషి చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రతి కార్యకర్త ఏకపక్షంగా గెలుపు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
సోలార్ ప్యానెల్ ఏర్పాటు బిల్లుల భారం తగ్గుదల..
విద్యుత్ బిల్లులు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఉచిత వ్యవసాయ పంపుసెట్లు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద రూ.2.5 లక్షల వరకుఉచిత వైద్యం వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.గ్రామ, క్లస్టర్ స్థాయి సమావేశాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ఆయన.. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం తమనైతిక బాధ్యతగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కార్యకర్తలు నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించిన సీఎం.. జూన్ 25 నుంచి నాయకులు, కార్యకర్తలు పర్యావరణహితంగా సైకిళ్లపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.