క్రైమ్ మిర్రర్, సినిమా:- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదలకు ముందే మంచి హైప్ను సొంతం చేసుకుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలు, ప్రమోషన్ కంటెంట్కు మంచి స్పందన రావడంతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర బృందానికి మద్రాస్ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
సినిమా పైరసీని అడ్డుకునేందుకు నిర్మాతలు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. సినిమా విడుదలకు ముందు లేదా విడుదలైన వెంటనే ఇంటర్నెట్లో అక్రమంగా లీక్ అయితే నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉందని కోర్టు గుర్తించింది. దీంతో పెద్ది సినిమాను అనుమతి లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, ప్రసారం చేయడం లేదా కాపీలు తయారు చేయడంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో కోర్టు ఇచ్చిన డైనమిక్ ఇంజంక్షన్ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. ఒకసారి పైరసీ వెబ్సైట్ను బ్లాక్ చేసిన తర్వాత అదే కంటెంట్ను కొత్త వెబ్సైట్ లేదా కొత్త యూఆర్ఎల్తో మళ్లీ అప్లోడ్ చేసినా వాటిని కూడా వెంటనే బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ కాలంలో సినిమాలను రక్షించడానికి ఇది బలమైన చర్యగా భావిస్తున్నారు.ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు విడుదలకు ముందే లీక్ కావడం వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే పెద్ది టీమ్ ముందుగానే జాగ్రత్త పడింది. సినిమా థియేటర్లలోకి వచ్చేలోపు ఇలాంటి చట్టపరమైన రక్షణ తీసుకోవడం మంచి నిర్ణయమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఇప్పటికే పెద్ది సినిమాపై భారీ బజ్ ఉండగా, కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో చిత్ర బృందానికి మరింత నమ్మకం పెరిగింది. అభిమానుల్లో కూడా ఆనందం కనిపిస్తోంది. రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ సినిమాగా వస్తున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.