క్రైమ్ మిర్రర్ : పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)లో కీలకంగా వ్యవహరించే సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. లష్కరేకు అనుబంధంగా పనిచేసే జమాత్ ఉద్ దవాలోనూ అతడు ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రార్థనా మందిరం ప్రవేశం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిన అతడు.. అనంతరం మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే అబ్దుల్ అజీజ్ మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణంగానే చనిపోయాడా? లేక విషప్రయోగం జరిగిందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు
అబ్దుల్ అజీజ్ జమ్మూకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు సహకరించేవాడని ఆరోపణలు ఉన్నాయి. వారికి సురక్షిత స్థావరాలు ఏర్పాటు చేయడం, ఆర్థిక సహాయం అందించడం, నకిలీ పత్రాలు సమకూర్చడం వంటి కార్యకలాపాల్లో అతడు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మార్గాల ద్వారా ఉగ్రవాదుల తరలింపులోనూ అతడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే బాధ్యతను కూడా అజీజ్ నిర్వహించేవాడని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇటీవల లష్కరేకు చెందిన రిజ్వాన్ హనీఫ్ విడుదల చేసిన ఓ వీడియో కలకలం రేపింది. తమ సంస్థకు చెందిన సుమారు 30 మంది సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని అతడు ఆరోపించాడు. గత నాలుగేళ్లలో పాకిస్థాన్, పీవోకే ప్రాంతాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాడు. లష్కరే తోయిబాకు చెందిన సభ్యులు వరుసగా హత్యలకు గురవుతున్నట్లు ఆ సంస్థకు చెందిన వ్యక్తి బహిరంగంగా ప్రస్తావించడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.
also read : ఐదేళ్ల ఎదురుచూపులకు తెర.. వరుణ్ తేజ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్
