క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను ఈరోజు(శనివారం) అధికారులు రికార్డ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తులో భాగంగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు సిట్ బృందం ఆయన నివాసానికి వెళ్లి వివరణ తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై జరుగుతున్న విచారణలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సిట్ అధికారులు విస్తృతంగా ఆధారాలు సేకరిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్లకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. ఈరోజు విచారణకు హాజరుకావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాతో తదితర వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరికొంతమంది కీలక వ్యక్తుల విచారణ జరిగే అవకాశం ఉందని సిట్ అధికారులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మంత్రి తుమ్మల స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సిట్ అధికారులు!!
By Crime Mirror
0
14