ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడ శౌర్య భవన్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు తమ అభిమాన హీరోను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులతో పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్పై ఆయన స్పందించారు. నెట్టింట జరిగే అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉండాలని అభిమానులకు సూచించారు.
“మన సమయం, శక్తిని మంచి విషయాల కోసం ఉపయోగించాలి. ఎవరో చేసే విమర్శలకు స్పందిస్తూ మన విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు” అనే సందేశాన్ని బన్నీ అభిమానులకు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం పాటిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు.
తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనిదని అల్లు అర్జున్ తెలిపారు. కార్యక్రమంలో అభిమానులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. తమ అభిమాన హీరోను దగ్గరగా కలుసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రానున్నట్లు సమాచారం.
also read: Train Viral Video: ఏసీ బోగీలో దీపం వెలిగించి పూజలు చేసిన ప్రయాణికుడు.. భద్రతపై ఆందోళన
