-
ఇండియా కూటమికి నో ఛాన్స్
-
తన నేతృత్వంలో ప్రాంతీయ కూటమి ఏర్పాటు
-
జాతీయస్థాయిలో తట్టస్థ వైఖరి అనే సంకేతాలు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు సీఎం విజయ్ షాక్ ఇచ్చారు. తన వ్యూహాత్మక రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆయన చేరలేదు. ఆయన నేతృత్వంలోని కొత్త కూటమిలో కాంగ్రెస్ చేరింది. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత డిఎంకెను విడిచిపెట్టి.. విజయ్ వెంట కాంగ్రెస్ నడిచిన సంగతి తెలిసిందే.
ఆయన ప్రభుత్వంలో సైతం కాంగ్రెస్ కీలక భాగస్వామిగా మారింది. అయితే తాజాగా కాంగ్రెస్, వి సి కె, ఎండిఎంకె, ఐయూఎంఎల్ అగ్ర నేతలతో ఒక సమావేశం నిర్వహించారు సీఎం విజయ్. అనంతరం తన కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఆలయన్స్ అని పేరు పెట్టారు. ఉమ్మడి కనీస ప్రణాళిక, కూటమి నిర్వహణకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
-
కమ్యూనిస్టులు దూరం..
విజయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి దూరంగా కమ్యూనిస్టులు ఉన్నారు. కేంద్రంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఏర్పడింది ఇండియా కూటమి. కానీ అందులో నేరుగా భాగస్వామి కాలేదు. తమిళనాడు స్థాయిలో విజయ్ ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయడం వెనుక బలమైన వ్యూహం ఉంది.
డీఎంకే నేతృత్వంలో కొనసాగుతున్న కూటమికి ప్రత్యామ్నాయంగా.. ద్రవిడ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం ప్రాతిపదికన ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగడమే విజయ్ ముందున్న లక్ష్యం.
ఇండియా కూటమి పరిధిలోకి వెళ్తే జాతీయస్థాయి రాజకీయ ఒత్తిళ్ళు, నిర్ణయాల వల్ల తన ప్రాంతీయ గుర్తింపు దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే తమిళనాడులోని సెక్యులర్ ఓటు బ్యాంకు ను తన వైపు తిప్పుకునేలా ఈ ప్రాంతీయ కూటమికి శ్రీకారం చుట్టారు.
-
రాహుల్ ఆలోచనలకు భిన్నం..
జాతీయస్థాయిలో విపక్షాల ఐక్యత కోసం ఏర్పాటు చేశారు ఇండియా కూటమిని. కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం వహిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్తో పోటీపడిన మిగతా ప్రాంతీయ పార్టీలు వెనుకబడిపోయాయి. మమతా బెనర్జీ తోపాటు కేజ్రీ వాల్ లాంటి వారు సొంత రాష్ట్రాల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాల్సిన పరిస్థితి.
ఈ తరుణంలో విజయ్ కూడా తమ రూట్లోకి వస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావించారు. అందుకే దశాబ్దాల స్నేహాన్ని విడిచిపెట్టి స్టాలిన్ కు దూరమయ్యారు. విజయ్ స్నేహాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు.
కానీ తనది ఇండియా కూటమి కాదు అని.. తానే స్వయంగా ఒక ప్రాంతీయ కూటమిని ప్రకటించడం మాత్రం విజయ్ వ్యూహాత్మక విజయం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్ పరిణామమే.
