క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ 2034 వరకు అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ ధీమాగా చెబుతున్నారు. తమ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ భరోసాగా ఉంది. బీజేపీ అధికారం దక్కించుకుటుందని కమలం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుల లెక్కలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తెలంగాణలో తమకు ఎవరితో పొత్తులు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. అటు పవన్ తెలంగాణలో ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించారు. తొలుత గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
మీనాక్షీ నటరాజన్ పైన జరిగిన కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీనాక్షి అంటే గిట్టనివారే ఈ పనిచేశారని, వారెవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే కంపు పార్టీ అని, ద్రోహుల పార్టీ వ్యవహారంలోకి తమను ఎందుకు లాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. ఒంటరిగానే పోటీ చేస్తాం. ఘన విజయం సాధిస్తాం. ఒంటరి పోరాటమే కలిసొచ్చింది. భవిష్యత్తులోనూ అదే పరిస్థితి ఉంటుంది’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. పాలనలో, హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్కు దారుణ పరాభవం తప్పదని పేర్కొన్నారు. జారుడు బల్లపై ఉన్న కాంగ్రెస్ రోజురోజుకూ దిగజారుతున్నదని, రాబోయే ఎన్నికల్లో దక్కేది ముమ్మాటికీ మూడో స్థానమేనని చెప్పారు.
బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ ఘంటాపథంగా చెప్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ పన్నెండేండ్ల పాలనలో తెలంగాణకు నయాపైసా న్యాయం జరుగలేదని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నామినేషన్ తిరస్కరణ, డీలిమిటేషన్, రైతు డిస్కమ్ ఏర్పాటులో దాగి ఉన్న కుట్రలు, భూముల వేలం ముసుగులో సాగుతున్న అక్రమాలు, హైడ్రాను అడ్డుపెట్టుకొని సాగిస్తున్న విధ్వంసం, బీఆర్ఎస్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, సింగరేణిలో కుంభకోణాలు, ఆర్టీసీ విలీన ప్రక్రియలోని గందరగోళంపైనా స్పందించారు. కాంగ్రెస్లో పదవులు అమ్ముకొంటున్న తీరును ఎండగట్టారు. రేవంత్రెడ్డి చేసిన దుర్మార్గాలతో వచ్చే పదిహేను, ఇరువై ఏండ్ల వరకు కాంగ్రెస్ను మరచిపోవా ల్సిందేనని సెటైర్లు వేశారు. కాంగ్రెస్లో డబ్బులిచ్చిన వారికే పదవులు వస్తున్నాయని ఆ పార్టీ నేత షబ్బీర్అలీ చెప్పింది ముమ్మాటికీ నిజమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.