-
మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి పదిలం
-
మరో మూడు రోజులు గడువు ఉండగా ఎమ్మెల్సీగా ఎంపిక
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మహమ్మద్ అజారుద్దీన్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. 90వ దశకంలో భారత క్రికెట్కు చిరస్మరణీయమైన విజయాలను అందించిన సారథి. తన మణికట్టు మ్యాజిక్ తో ప్రత్యర్థీ క్రీడాకారులను ముప్పు తిప్పల పెట్టిన గొప్ప క్రీడాకారుడు. రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర చాటుతున్నారు. పొలిటికల్ పిచ్ పై ఆయన ఆడిన గేమ్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో టీమ్ ఇండియా ఓటమి అంచునవుంటే.. బ్యాట్ పట్టుకొని ఎలాంటి విజయాన్ని అందించారో.. ఇప్పుడు తన మంత్రి పదవి విషయంలోనూ అలానే ఆఖరి బంతిలో.. ఎమ్మెల్సీ పదవిని పట్టి.. తన మంత్రి పదవిని పదిల పరుచుకున్నారు.
ఆరు నెలల కిందట మంత్రి పదవి..
ఆరు నెలల కిందట జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో బైపోల్ అనివార్యంగా మారింది. అధికార పార్టీగా కాంగ్రెస్ గెలవడం అక్కడ కీలకం. సీఎం రేవంత్ రెడ్డికి ఈ బై పోల్ ప్రతిష్టాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు కీలకం. దీంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకుగాను మహమ్మద్ అజారుద్దీన్ ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు రేవంత్. అజారుద్దీన్ ఏ చట్టసభల్లో కూడా సభ్యుడు కాదు. అందుకే ఆయనను మంత్రిని చేసిన రేవంత్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేశారు. కానీ అప్పటికే గత గవర్నర్ ఉండే సమయంలోనే ఫైల్ వెళ్లగా పక్కన పెట్టారు. కొత్త గవర్నర్ వచ్చిన తరువాత ఈ ఫైల్ విషయంలో సందిగ్ధత కొనసాగింది. కానీ రేవంత్ తన ఢిల్లీ పరపతి ఉపయోగించి.. మూడు రోజులు గడువు ఉండగానే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేయగలిగారు. మైనారిటీ శాఖ మంత్రిగా ఆయనను కొనసాగించగలిగారు.
అరుదైన చాన్స్..
ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో పదవి దక్కడమే కష్టం. గత ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు అజారుద్దీన్. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రూపంలో అరుదైన అవకాశం అజారుద్దీన్ కు దక్కింది. అయితే దానిని శాశ్వతం చేసుకోవడం ఆయనకు పెను సవాల్ గా మారింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి రూపంలో. అజారుద్దీన్ ను మంత్రిగా కొనసాగించకపోతే.. తనకు ఇబ్బందులు వస్తాయని సీఎం రేవంత్ కు తెలుసు. అందుకే పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నించారు. కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను ఒప్పించ గలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టి టీమ్ ఇండియాకు చిరస్మరణీయమైన విజయం అందించినట్టే.. మరో మూడు రోజులు గడువు ఉండగా ఎమ్మెల్సీ పదవికి ప్రమాణ స్వీకారం చేసి.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధీమాను సజీవంగా ఉంచగలిగారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ కోదండరాం సైతం ఎమ్మెల్సీ అయ్యారు.