పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత కూడా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మోండికేశారు. తనపై గెలిచింది బీజేపీ కాదు, ఎన్నికల కమిషనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారానికి దారితీశాయి.
అయితే తాజాగా జరిగిన పరిణామాలు కొత్త చర్చకు కారణమయ్యాయి. బీజేపీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మమతా బెనర్జీ తన వైఖరిలో కొంత మార్పు తీసుకొచ్చినట్లు కనిపించింది. ఆమె తన ఎక్స్ ఖాతాలో బయోను మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని మాత్రమే ఉన్న బయోను.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసనసభ)గా మార్చుకున్నారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో రాజ్ భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాష్ట్ర గవర్నర్ R. N. రవి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2026 మే 7 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీ తదుపరి వ్యూహం ఏంటన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది.