పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ – అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించాలని భావించిన పాకిస్థాన్కు ఇప్పుడు కొత్త రాజకీయ, భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన “అబ్రహం ఒప్పందాల్లో” చేరాలన్న అమెరికా ఒత్తిడి ఇస్లామాబాద్ను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా చేస్తున్న ఒత్తిడి ఒకవైపు ఉండగా, దేశీయంగా తీవ్ర మతపరమైన, రాజకీయ ప్రతికూలతలు మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ పరిస్థితి “ముందు గొయ్యి.. వెనుక నుయ్యి” అన్నట్టుగా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన పేరుతో అమెరికా ప్రవేశపెట్టిన అబ్రహం ఒప్పందాలు ఇప్పటికే పలు అరబ్ దేశాలను ఇజ్రాయెల్తో సంబంధాల దిశగా నడిపించాయి. ఇప్పుడు అదే ఒత్తిడి పాకిస్థాన్పై కూడా పెరుగుతోందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు అమెరికా మద్దతు అత్యంత కీలకంగా మారింది. అంతర్జాతీయ రుణాలు, ఆర్థిక సహాయం, వ్యూహాత్మక మద్దతు కోసం అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తిస్తే దేశవ్యాప్తంగా భారీ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఉగ్రవాద సంస్థల నుంచి బహిరంగ హెచ్చరికలు రావడం సంచలనంగా మారింది. లష్కర్-ఎ-తైబా డిప్యూటీ చీఫ్గా గుర్తింపు పొందిన సైఫుల్లా కసూరి నేరుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. “పాకిస్థాన్లో ఎవరు అయినా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడానికి లేదా దౌత్య సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తే వారిని వదిలిపెట్టం” అంటూ ఆయన హెచ్చరించడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ హెచ్చరికలు నేరుగా ప్రభుత్వం, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు పాకిస్థాన్ అంతర్గత భద్రతపై ఆందోళనలను మరింత పెంచింది.
ప్రస్తుతం పాకిస్థాన్ అత్యంత సంక్లిష్టమైన దశను ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అమెరికాతో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ అంశంలో నిర్ణయం తీసుకుంటే దేశీయంగా తీవ్ర వ్యతిరేకత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, గతంలో పెంపొందించబడిన ఉగ్రవాద సంస్థలే ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారడం పాకిస్థాన్లో పెరుగుతున్న అస్థిరతకు సంకేతంగా కనిపిస్తోంది. దేశ రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపే స్థాయిలో ఉన్న తీవ్రవాద గుంపులు ఇప్పుడు ఆర్మీ చీఫ్కే బహిరంగ హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇరాన్ – అమెరికా మధ్య రాయబారం నడపాలని భావించిన పాకిస్థాన్ ఇప్పుడు సొంత దేశంలోనే ఉగ్రవాద ఒత్తిళ్లు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, రాజకీయ అస్థిరతల మధ్య చిక్కుకుపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గినా ప్రమాదమే, ఇజ్రాయెల్ను తిరస్కరించినా వ్యూహాత్మకంగా నష్టమే అనే పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ALSO READ: హార్ట్ ఎటాక్కి అసలైన కారణం తెలిస్తే షాకవుతారు..