King Cobra: ఈ భూమిపై వేల సంఖ్యలో పాము జాతులు జీవిస్తున్నప్పటికీ వాటిలో చాలా జాతుల గురించి సాధారణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. ముఖ్యంగా అడవుల్లో నివసించే కొన్ని అరుదైన పాముల జీవన విధానం, వేటాడే తీరు, ప్రకృతిలో వాటి పాత్ర గురించి చాలా మందికి తెలియదు. అలాంటి అత్యంత అరుదైన, విశిష్టమైన పాము జాతుల్లో కింగ్ కోబ్రాలు ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో గిరినాగులు అని పిలిచే ఈ భారీ విషసర్పాలు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. గిరినాగులు అగ్రస్థాయి వేటాడే జీవులుగా గుర్తింపు పొందాయి. వీటి ప్రధాన ఆహారం ఇతర పాములే కావడం విశేషం. నాగుపాములు, కట్లపాములు వంటి విషపూరిత పాములను వేటాడి తినడం ద్వారా జనావాసాల్లో విషసర్పాల సంఖ్య అదుపులో ఉండేలా చేస్తాయి. ఈ కారణంగా మనుషులు, పాముల మధ్య జరిగే ప్రమాదాలను పరోక్షంగా తగ్గించడంలో గిరినాగులు సహకరిస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఒక అడవిలో గిరినాగులు ఉన్నాయంటే ఆ అడవి ఆరోగ్యకరమైన జీవ వైవిధ్యంతో ఉందని పర్యావరణ వేత్తలు భావిస్తారు.
ఇక గిరినాగులకు ఉన్న అత్యంత ప్రత్యేక లక్షణం గూడు కట్టుకుని గుడ్లు పెట్టడం. ప్రపంచంలో గూడు నిర్మించి గుడ్లు పెట్టే ఏకైక పాము జాతిగా కింగ్ కోబ్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆడ గిరినాగు గర్భం దాల్చిన తరువాత ఎండిపోయిన వెదురు ఆకులు, పొడి ఆకులను సేకరించి నేలపై దిబ్బలా గూడు తయారు చేస్తుంది. అనంతరం అందులో 30 నుంచి 40 వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తరువాత ఆ తల్లి పాము సుమారు నెల నుంచి నెలన్నర వరకు ఆహారం కూడా తీసుకోకుండా గూడు వద్దే కాపలా కాస్తుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చే సమయం దగ్గరపడినప్పుడు మాత్రం తల్లి గిరినాగు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పిల్లలు పుట్టిన వెంటనే వాటిని తినకుండా ఉండే సహజసిద్ధమైన ప్రవృత్తి కారణంగానే తల్లి పాము గూడు విడిచి వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే తల్లి పాము అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ గూళ్లకు ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. అడవి పందులు, ముంగిసలు, ఇతర జంతువులు గూళ్లను తవ్వి గుడ్లను తినేయడంతో గిరినాగుల సంతతి క్రమంగా తగ్గిపోతోందని అటవీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే ప్రమాదంలోకి చేరుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కనుమల ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్లైఫ్ సొసైటీ అటవీ శాఖతో కలిసి గిరినాగుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అడవుల్లో గిరినాగుల గూళ్లను గుర్తించి వాటికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ కవచాలు, దోమతెరలు ఏర్పాటు చేస్తున్నారు. గుడ్లు సురక్షితంగా పొదిగేలా పర్యవేక్షణ కూడా నిర్వహిస్తున్నారు.
అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే 30కి పైగా గిరినాగు పిల్లలను విజయవంతంగా పొదిగించి తిరిగి అడవుల్లోకి విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో గిరినాగులు కనిపిస్తే భయంతో చంపేసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మాత్రం ప్రజల్లో అవగాహన పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడైనా గిరినాగులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ లేదా సంరక్షణ బృందాలకు సమాచారం అందించేలా స్థానికులకు శిక్షణ ఇచ్చారు. అరుదైన ఈ పాము జాతిని కాపాడేందుకు ప్రభుత్వం, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.
ALSO READ: ఇరాన్ యుద్దం.. భారత్కు గోమాత రక్షణ