India Faces Extreme Heat: ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ భారత్ నిప్పులు కుంపటిలా మారిపోయింది. దేశంలోని అనేక నగరాలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. తాజాగా విడుదలైన తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలో అత్యంత వేడిగా ఉన్న 20 నగరాల్లో 19 నగరాలు భారత్లోనే ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
మూడు రోజుల పాటు వడగాలులు
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ వేడి మరింత పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 22 నుంచి కనీసం మూడు రోజుల పాటు వడగాలులు కొనసాగనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరాయి. బిహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ వంటి నగరాలు 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో అగ్రస్థానంలో నిలిచాయి. అలాగే బిహార్లోని బెగుసరాయ్, మోతిహరి, ముంగేర్, అలాగే పశ్చిమబెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నేపాల్ లుంబిని కూడా..
అటు ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో భారత్ వెలుపల చోటు దక్కించుకున్న ఏకైక నగరం నేపాల్లోని లుంబిని కావడం విశేషం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా, దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ తీవ్ర ఎండలు ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి.