ఖమ్మం నగరంలో జరిగిన ఓ సంచలన ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్త వేధింపుల నుంచి న్యాయం కోసం మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన ఓ వివాహితకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారినే ఆమె జీవితాన్ని నాశనం చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం కమిషనరేట్లో పనిచేస్తున్న సీసీఎస్ సీఐ బానోత్ రాజు నాయక్పై కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహిత తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో బాధితురాలి ఫిర్యాదులో ఉన్న ఫోన్ నంబర్ను తీసుకున్న సీఐ రాజు నాయక్, ఆమెకు న్యాయం చేస్తానని నమ్మకం కల్పిస్తూ తరచూ ఫోన్లు, సందేశాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొదట కేసు పరిష్కారం పేరుతో దగ్గరైన ఆయన, అనంతరం ప్రేమ పేరుతో బాధితురాలిని మానసికంగా ప్రభావితం చేసి పెళ్లి చేసుకుంటానని హామీలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెను తన ఆధీనంలోకి తీసుకుని లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కొంతకాలానికి బాధితురాలు గర్భవతి కావడంతో తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని సీఐపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే పెళ్లి విషయాన్ని తప్పించుకునేందుకు సీఐ రాజు నాయక్ బలవంతంగా కొన్ని మాత్రలు మింగించాడని, వాటి కారణంగా గర్భస్రావం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఆ తరువాత కూడా పెళ్లి విషయం ప్రస్తావించిన ప్రతిసారి సీఐ తప్పించుకుంటూ రావడంతో బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది.
చివరకు ఈనెల 7న బాధితురాలు ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టగా, సీఐ వేధింపులకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీఐ రాజు నాయక్పై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా బాధితురాలికి ఇటీవలే ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా విడాకులు మంజూరైనట్లు తెలిసింది. ఈ విడాకుల వ్యవహారంలో కూడా సీఐ రాజు నాయక్ జోక్యం చేసుకుని బాధితురాలి భర్తపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మహిళ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే అదే వ్యవస్థలోని అధికారి ఆమెను మోసం చేశాడనే ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
ALSO READ: GT vs SRH: RCBని ఢీకొట్టే టీం ఏదంటే..?