Homeతెలంగాణకేసీఆర్ స్పీచ్‌కు 36 లక్షల వ్యూస్, అదే సీఎం రేవంత్‌కు పట్టుమని..? హరీష్ రావు సంచలనం

కేసీఆర్ స్పీచ్‌కు 36 లక్షల వ్యూస్, అదే సీఎం రేవంత్‌కు పట్టుమని..? హరీష్ రావు సంచలనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే కడుపుమంటతో పాటు తీవ్రమైన అక్కసు ఉందని విమర్శించారు. తెలంగాణ సమాజం కోసం కేసీఆర్ తపన పడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం చిల్లర మాటలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల, కాటారం సభల తర్వాత ప్రజలకు ఒక విషయం స్పష్టమైందని హరీష్ రావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్న వార్తలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తన పర్యటనలో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేశారు. ఫిరాయింపుల కేసుపై న్యాయ నిపుణులతో చర్చించేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి అందరి కళ్లముందే విమానం ఎక్కి వెళ్లాను తప్ప దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని గుర్తు చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పనిలేని వారే తన పర్యటనలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహస్య భేటీలు నిర్వహించడం రేవంత్ రెడ్డికే వెన్నతో పెట్టిన విద్య అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రాత్రి సమయంలో రాహుల్ గాంధీని కలిసి.. ఉదయం పూట కేంద్ర మంత్రులను అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను కలవడం రేవంత్‌కే అలవాటని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిని కేసీఆర్ స్థాయితో పోల్చుకుంటే అసలు విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన కేసీఆర్ ప్రసంగాన్ని సోషల్ మీడియా వేదికగా 36 లక్షల మంది వీక్షించారని తెలిపారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే చూశారని గణాంకాలను బయటపెట్టారు.

తెలంగాణ ప్రయోజనాల గురించి కేసీఆర్ అత్యంత హుందాగా మాట్లాడారని హరీష్ రావు కొనియాడారు. సీఎంవో నుంచి వస్తున్న లీకులు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని కొట్టిపారేశారు. రాజకీయాల్లో పద్ధతిగా ఉండటం నేర్చుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఫిరాయింపుల చట్టం అమలు విషయంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సమాజంలో కేసీఆర్ పట్ల ఉన్న ఆదరణ చూసి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని హరీష్ రావు విమర్శించారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం బురదజల్లే రాజకీయాలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే తన ఢిల్లీ పర్యటనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. సరైన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని హరీష్ రావు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Breaking: ఆర్టీసీ సమ్మె ప్రారంభం…బస్సులు బంద్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు