దేశంలో ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సగటున 43 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలై 2 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
111 జిల్లాలపై ఎల్ నినో ఎఫెక్ట్
తక్కువ వర్షాల కారణంగా ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పంట నష్టానికి ఎక్కువగా గురయ్యే 111 జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని మొత్తం 315 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు
అందులోనూ 25 శాతం కంటే తక్కువ నీటి సదుపాయం ఉన్న 111 జిల్లాలను అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో పంటల సాగు, నీటి నిర్వహణ, రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. తక్కువ నీటితో పెరిగే పంటలు, తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సిఫారసు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఖరీఫ్ సీజన్లో పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.