క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ (2BHK) ఇళ్ల పంపిణీపై రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరు (మే 2026) లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, ఇళ్లను కేటాయించాలని అధికారులకు గడువు విధించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు మరియు కేటాయింపులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస వసతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ₹391.23 కోట్లను కేటాయించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గరిష్టంగా ₹5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు.
ఒకవేళ కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకుంటే, లబ్ధిదారులే స్వయంగా పూర్తి చేసుకునేలా నిధులను ‘గ్రీన్ ఛానల్’ ద్వారా విడుదల చేస్తారు. ఇళ్లలో అనర్హులు ఎవరైనా నివసిస్తుంటే వెంటనే వారిని తొలగించి, నిజమైన పేదలకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. కేటాయించిన ఇళ్లలో నివసించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసి, ఇతరులకు కేటాయిస్తారు. నిర్మాణం కోసం లబ్ధిదారులకు 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తారు. బీదరికాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు.