జియాలజీ (భూ విజ్ఞానం) కోర్సు సైన్స్ పట్టభద్రులకు మంచి అవకాశాలు కలిగించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ఒకటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యావరణ కన్సల్టెన్సీలు, మైనింగ్, పెట్రోలియం, భూగర్భ జలాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, పరిశోధనా, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.
CPGET–2026 ద్వారా M.Sc. భూగర్భశాస్త్రంలో ప్రవేశాలు
ఎం.ఎస్.సీ జియాలజీ ప్రవేశాలు CPGET–2026 ద్వారా జరగనున్నాయి. ఈ ఏడాది దరఖాస్తులు మే 15, 2026 నుంచి ప్రారంభం అయ్యాయి. జూన్ 10 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 14 వరకు రూ.500, జూన్ 18 వరకు రూ.2000 ఆలస్య రుసుముతో అవకాశం ఉంటుంది. జూన్ 28న హాల్ టికెట్లు విడుదలవుతాయి. పరీక్ష జూలై 2026 మొదటి వారంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800గా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టులకు ప్రతి పరీక్షకు రూ.450 చెల్లించాలి. దరఖాస్తులు https://cpget.tgche.ac.in వెబ్సైట్ ద్వారా సమర్పించాలి.
ఎం.ఎస్సీ. జియాలజీకి అర్హత
జియాలజీ చదవాలనుకునే అభ్యర్థులు బి.ఎస్సీ పూర్తి చేసి ఉండాలి. భూగర్భ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వంటి సబ్జెక్టులు చేసినవారు అర్హులు.
జియాలజీ పట్టభద్రులకు బోలెడు ఉద్యోగ అవకాశాలు
జియాలజీ పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. జియాలజిస్ట్, హైడ్రోజియాలజిస్ట్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్, మైనింగ్ నిపుణులు, GIS అనలిస్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ వంటి పాత్రల్లో అవకాశాలు ఉంటాయి. ONGC, GSI, CGWB, ISRO, NRSC, SCCL, NMDC, NLC లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్ష కూడా ఒక కీలక కెరీర్ మార్గంగా ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా GSIలో గ్రూప్-A జియాలజిస్ట్ పోస్టులు, CGWBలో సైంటిస్ట్ పోస్టులు లభిస్తాయి. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.80,000 నుంచి రూ.1,10,000 వరకు జీతం లభిస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్ అవకాశాలు కూడా ఉన్నాయి. ONGC మెరిట్ స్కాలర్షిప్ ద్వారా రూ.96,000 వరకు, కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ల ద్వారా నెలకు రూ.15,000 వరకు సహాయం లభిస్తుంది.
CPGET–2026 కోసం ఉచిత కోచింగ్
ఎంజియు భూగర్భ శాస్త్ర విభాగం CPGET–2026 కోసం ఉచిత కోచింగ్ కూడా అందిస్తోంది. మే 25, 2026 నుంచి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ మార్గదర్శనం చేస్తున్నారు. స్టడీ మెటీరియల్, గత ప్రశ్నపత్రాలు, పరీక్ష మార్గదర్శకం వంటి సహాయం అందుతుంది. ఇందుకోసం వాట్సాప్ లింక్ షేర్ చేశారు. https://chat.whatsapp.com/LbhSTYLn G169oa2IY3Qi45

నల్లగొండ సమీపంలోని ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్ర విభాగం 2011లో ప్రారంభమైంది. 20 సీట్లతో ప్రారంభమైన ఈ డిపార్ట్ మెంట్.. ప్రస్తుతం 40 సీట్లకు పెరిగింది.సైన్స్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజియు) భూగర్భ శాస్త్ర విభాగం ఇన్చార్జ్ హెడ్ డాక్టర్. మల్లికంటి ఆంజనేయులు సూచించారు. పూర్తి వివరాల కోసం తమను సంప్రదించాలన్నారు.
డాక్టర్. మల్లికంటి ఆంజనేయులు
ఇన్చార్జ్ హెడ్, భూగర్భశాస్త్ర విభాగం
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ,
ఫోన్: +91 95536 77369.