క్రైమ్ మిర్రర్ : పాకిస్తాన్లోని అప్పర్ సౌత్ వజిరిస్తాన్ ప్రాంతంలో నీటి కొరత సైనికుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసినట్లు సమాచారం. అస్మాన్ మాంజా బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్లోని నీటి పంపిణీ కేంద్రం వద్ద రెండు వర్గాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలు, ఫ్రంటియర్ కార్ప్స్ (FC) సిబ్బంది, సాధారణ దుస్తుల్లో విధులు నిర్వహించే మిలిటరీ ఇంటెలిజెన్స్ సిబ్బంది మధ్య ఈ వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండటంతో కొంతకాలంగా ట్యాంకర్ల ద్వారా సైనికులకు నీటిని అందిస్తున్నారు.
తాజాగా ఓ నీటి ట్యాంకర్ రావడంతో దాని నీటిని ముందుగా ఎవరు వినియోగించుకోవాలనే అంశంపై వివిధ విభాగాల సిబ్బంది మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణగా మారి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 22 మంది సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత సమన్వయం, వనరుల కొరత వంటి అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యంగా సైనిక స్థావరంలోనే ప్రాథమిక అవసరమైన తాగునీటి కోసం విభాగాల మధ్య ఘర్షణ జరగడం పాక్ సైన్యం ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను కూడా వెలుగులోకి తెస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
also read : ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’కు A సర్టిఫికెట్.. సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి
