హర్యానాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సాహస విన్యాసంలో భాగంగా చేసిన ఓ ప్రమాదకర స్టంట్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. నూహ్ జిల్లా ఖోరీ కలాన్ గ్రామంలో సంచార సర్కస్ బృందం నిర్వహించిన ‘సజీవ సమాధి’ ప్రదర్శనలో దీపక్ (27) అనే యువకుడు మృతి చెందాడు.
సమాచారం ప్రకారం.. సర్కస్ బృందం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దీపక్ను భూమిలో గుంత తవ్వి సమాధి చేశారు. 24 గంటల తర్వాత అతడిని సురక్షితంగా బయటకు తీస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే నిర్ణీత సమయం దాటినా దీపక్ను బయటకు తీయలేదు.
దాదాపు 36 గంటల తర్వాత అతడిని బయటకు తీసిన సమయంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎక్కువ సమయం భూమిలో ఉండటం వల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సరైన భద్రతా చర్యలు లేకుండా ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు నిర్వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.
also read: రేషన్ కార్డ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ!
