క్రైమ్ మిర్రర్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోక్సో కేసుకు సంబంధించిన మరో ఘటన కలకలం రేపింది. గతంలో లైంగిక వేధింపులకు గురైన 14 ఏళ్ల బాలికను కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో బాలికను అపహరించిన ఘటనకు సంబంధించి రాజ్కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న సమయంలోనే కేసును వెనక్కి తీసుకోవాలని బాలిక, ఆమె కుటుంబ సభ్యులపై నిందితుడు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో తీవ్రంగా మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై ఒత్తిడి, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : ఆళ్లపల్లిలో వ్యక్తి దారుణ హత్య
