క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ప్రేమ వ్యవహారం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జవహర్నగర్కు చెందిన యావన్ (23), అతను ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో యావన్ గత నాలుగేళ్లుగా సీతాఫల్మండికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడని సమాచారం.
వీరి బంధాన్ని వ్యతిరేకించిన యువతి బంధువులు, గతంలోనే అతన్ని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఈ క్రమంలో గురువారం రాత్రి (మే 7, 2026) యావన్ తన స్నేహితులతో కలిసి ఉండగా, మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు దుండగులు కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వెంబడించి మరీ 17 చోట్ల పొడిచి దారుణంగా హతమార్చారు.
ఈ హత్యకు నిరసనగా మృతుడి బంధువులు శుక్రవారం ఉదయం సీతాఫల్మండిలోని యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో చిలకలగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిలకలగూడలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.