BrahMos Production Slows Down: భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్ మిస్సైల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. కొత్త తరానికి చెందిన బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కోసం ఉత్తరప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నప్పటికీ, దీనికి కేంద్రం నుంచి పూర్తి అనుమతులు ఇంకా రాలేదు. అయినప్పటికీ, ఇప్పటికే కొన్ని కీలక మార్పులు చేపట్టడం వల్ల సమస్యలు తలెత్తాయి.
ఎందుకు ఉత్పత్తి తగ్గిందంటే?
హైదరాబాద్, నాగపూర్ వంటి కేంద్రాల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన సీనియర్ ఉద్యోగులను లఖ్నవూ, పిలానీ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ బదిలీపై చాలా మంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బదిలీలకు నిరాకరించగా, మరికొందరు ఉద్యోగాలకు రాజీనామాలు కూడా చేశారు. దీంతో ఉత్పత్తి ప్రక్రియపై నేరుగా ప్రభావం పడింది. అనుభవం ఉన్న సిబ్బంది లేకపోవడం వల్ల అసెంబ్లింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ వంటి కీలక విభాగాల్లో పని నెమ్మదించింది. ఫలితంగా క్షిపణుల ఉత్పత్తి సుమారు 50 శాతం వరకు తగ్గినట్లు సమాచారం. ఇక లఖ్నవూలో భవిష్యత్ బ్రహ్మోస్-ఎన్జీ క్షిపణుల అభివృద్ధి, పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందే నిర్ణయించింది. 2021లో దీనికి అనుమతి ఇచ్చినా, ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లలేదు.
నేవీపై తీవ్ర ప్రభావం
ఈ పరిణామాలు ఇండియన్ నేవీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024లో నౌకాదళం 220 బ్రహ్మోస్ క్షిపణులను ఆర్డర్ చేసింది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా అవసరాల దృష్ట్యా ఈ క్షిపణులు చాలా కీలకం. ఉత్పత్తి తగ్గితే డెలివరీలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. సిబ్బంది బదిలీలు, అనుమతుల ఆలస్యం కారణంగా బ్రహ్మోస్ ఉత్పత్తి దెబ్బతింటోంది. ఇది భవిష్యత్లో భారత రక్షణ సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.