హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జూలై 29న ఉదయం వాకింగ్కు వెళ్లిన 62 ఏళ్ల వృద్ధుడు అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల వివరాల ప్రకారం, కే. మర్రియప్ప అనే వృద్ధుడు ప్రతిరోజు మాదిరిగానే ఉదయం నడకకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన ఎదురుగా వచ్చిన రెండు వీధి కుక్కలు మొరిగి దగ్గరకు రావడంతో భయాందోళనకు గురయ్యారు. వాటిని తరిమేందుకు ప్రయత్నించే క్రమంలో ఆయన కాలు జారి పక్కనే ఉన్న బండరాయిపై బలంగా పడిపోయారు.
ఈ ప్రమాదంలో మెడకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వీధి కుక్కల సమస్యపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
also read: కూలీ మహిళ పేరుతో రూ.2.75 కోట్లు జీఎస్టీ- ఖాతా ఫ్రీజ్… ఆందోళనలో బాధితురాలు
