క్రైం మిర్రర్ : రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రామ్దేవ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహర్కి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ సభ్యులు నీటి ట్యాంక్లోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సమయంలో జస్రాజ్ అనే వ్యక్తి అరుపులు వినిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే నీటి ట్యాంక్ వద్దకు చేరుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను లోహర్కి గ్రామానికి చెందిన జుగ్తారామ్ సుతార్ కుమారుడు జస్రాజ్ సుతార్ (29), ఆయన భార్య నిర్మ సుతార్ (25), వారి కుమారుడు భరత్ (10), కుమార్తె మనీషా (5)గా గుర్తించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు వివరాల ఆధారంగా పూర్తి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
also read : ఏసీబీ చేతిలో అవినీతి చిట్టా! ఇక ఐఏఎస్, ఐపీఎస్ లపై గురి …
