గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ను మార్కెట్లోకి ఆవిష్కరించడంపై ప్రధాన పోటీదారు శాంసంగ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించింది. యాపిల్ సరికొత్తగా తీసుకొచ్చామని చెబుతున్న ఈ ఫోల్డబుల్ సాంకేతికత అసలు కొత్తదేమీ కాదని, తాము ఎప్పుడో మార్కెట్కు పరిచయం చేసిన పాత టెక్నాలజీనేనని కొట్టిపారేసింది. తాము దాదాపు ఏడేళ్ల క్రితమే అభివృద్ధి చేసిన ప్రొడక్ట్ కాన్సెప్ట్ను యాపిల్ ఇప్పుడు అత్యంత వినూత్నమైనదిగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని శాంసంగ్ వ్యాఖ్యానించింది. “మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి పడ్డించినట్లే యాపిల్ తీరు ఉంది” అంటూ ఘాటుగా చురకలంటించింది. తమ పాత ఫీచర్లనే యాపిల్ కొత్త పేరుతో తీసుకొచ్చిందని ఎద్దేవా చేసింది.
కాగా, 2019 సంవత్సరం నుంచే తాము ‘గెలాక్సీ ఫోల్డ్’ సిరీస్లో రకరకాల ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చి విజయవంతంగా విక్రయిస్తున్నామని గుర్తుచేసింది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విభాగంలో సాంకేతికంగానూ, వినియోగంలోనూ తమ ‘గెలాక్సీ ఫోల్డ్’ ఎప్పుడూ అత్యుత్తమ స్థానంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శాంసంగ్ చేసిన ఈ సెటైరికల్ పోస్టులు టెక్ ప్రియుల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
టీమిండియాకు డబుల్ ధమాకా.. ఫిట్నెస్ టెస్ట్ పాసైన ‘బూమ్ బూమ్’ బుమ్రా
