కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఏర్పడిన అనుమానం చివరకు ప్రాణాంతకంగా మారింది. కేవలం 16 ఏళ్ల బాలుడు తన గర్ల్ఫ్రెండ్గా భావించిన బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, బాలుడు, బాలిక ఒకే వయసుకు చెందిన వారు. బాలిక మరో అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతోందని బాలుడు అనుమానించాడు. ఈ అనుమానం క్రమంగా ఆగ్రహంగా మారి, చివరకు హింసాత్మకంగా ప్రవర్తించేలా చేసింది. జులై 10న కనకపుర తాలూకాలోని కెంపలనాథ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ప్లాన్ ప్రకారం బాలికను ఒంటరిగా కలిసిన బాలుడు, తన వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన తర్వాత తన చేసిన పనిని దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టేందుకు అతని సోదరుడు, మేనమామ సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని రోజుల పాటు బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది.
ప్రస్తుతం ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన సోదరుడు, మేనమామలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.
also read: అర్ధరాత్రి కలకలం.. ఆలయం నుంచి విగ్రహం తీసుకెళ్లిన యువతి…. అనంతరం చెరువులో మృతి