ఓటీటీ ప్రపంచంలో ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ కథల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆసక్తికరమైన క్రైమ్ కథలు, ప్రతి ఎపిసోడ్లో కొత్త మలుపులు, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే కథాంశాలతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్లకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకున్న ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీ రంగంలో అరుదైన మైలురాయిని చేరుకుని చర్చనీయాంశంగా మారింది.
ఈ సిరీస్ పేరు ‘ధూల్పేట పోలీస్స్టేషన్’. క్రైమ్, దర్యాప్తు, సస్పెన్స్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కథ విషయానికి వస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఓ బస్తీలో ఒకే రాత్రిలో వరుసగా 3 హత్యలు జరగడంతో నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ సంచలన ఘటనల వెనక అసలు కారణాలు ఏంటి అనే దానిపై దర్యాప్తు చేపట్టేందుకు ఇద్దరు పోలీస్ అధికారులు రంగంలోకి దిగుతారు. మొదట సాధారణ హత్య కేసుల్లా కనిపించిన ఈ ఘటనలు దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ కొత్త కోణాలు బయటపడతాయి. ప్రతి ఆధారం కొత్త అనుమానాలకు దారితీయగా కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ ప్రయాణంలో క్షుద్ర పూజలు, నరబలులు, రహస్య కార్యకలాపాల కోణాలు ఉన్నాయా అనే సందేహాలు కూడా కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. అయితే అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే సిరీస్ను పూర్తిగా చూడాల్సిందే.
ఈ వెబ్ సిరీస్కు జశ్విని దర్శకత్వం వహించగా, ఇందులో అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 50 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్ ప్రతి భాగంలో ఉత్కంఠను కొనసాగిస్తూ ప్రేక్షకులను తదుపరి భాగం వైపు తీసుకెళ్తోందని ప్రేక్షకుల అభిప్రాయం. విడుదలైన కొద్ది కాలంలోనే ఈ సిరీస్ ఏకంగా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం విశేషంగా మారింది.
ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా సంస్థ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలతో ఈ సిరీస్ తన విజయయాత్రను కొనసాగిస్తోందని, ఓటీటీ రంగంలో అత్యంత పెద్ద లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్లలో ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. స్ట్రీమింగ్ నిమిషాల పరంగా చూస్తే తెలుగు ఓటీటీ కంటెంట్కు ఇది మరో గుర్తుండిపోయే విజయంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థలకు సీరియస్ వార్నింగ్!