భారతీయ వివాహ సంప్రదాయాల్లో అల్లుడికి ఇచ్చే మర్యాదలు, కానుకలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సమయంలో అల్లుళ్లకు ఖరీదైన బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలు బహుమతిగా ఇవ్వడం సాధారణంగానే కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రలో ఓ మామగారు తన అల్లుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అందరూ ఆశ్చర్యపడేలా ఒక విభిన్నమైన కానుకను అందించారు. ఏకంగా ఒకటిన్నర కిలోల వెండితో తయారు చేసిన కొల్హాపూరి చెప్పులను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాంగ్లీ జిల్లాకు చెందిన ఓ ధనిక కుటుంబం తమ అల్లుడి కోసం ప్రత్యేకంగా వెండితో కొల్హాపూరి చెప్పులను తయారు చేయించింది. సంప్రదాయ హస్తకళలకు పేరుగాంచిన కొల్హాపూర్లోని ప్రముఖ కళాకారుడిని సంప్రదించి ఈ చెప్పుల రూపకల్పన చేపట్టించారు. సాధారణ చెప్పుల్లా కాకుండా సంప్రదాయ శైలిని కాపాడుతూ పూర్తిగా వెండితో ఈ చెప్పులను రూపొందించడం కోసం కళాకారుడు ఎంతో శ్రమించాడు. సుమారు ఎనిమిది రోజుల పాటు నిరంతరం పని చేసి ఈ ప్రత్యేక జతను తయారు చేసినట్లు సమాచారం.
ఈ వెండి కొల్హాపూరి చెప్పుల మొత్తం బరువు సుమారు 1.5 కిలోలు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి ధర దాదాపు రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెప్పుల తయారీకి మాత్రమే కళాకారుడికి రూ.22 వేల కూలి చెల్లించినట్లు తెలిసింది. బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న సమయంలోనూ ఖర్చును పట్టించుకోకుండా అల్లుడికి ఇంత విలాసవంతమైన కానుక ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. కుటుంబ ప్రతిష్ఠను, బంధానికి ఇచ్చే ప్రాధాన్యతను ఈ కానుక ద్వారా చాటాలని మామగారు భావించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వెండి చెప్పుల ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ అరుదైన బహుమతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. “అల్లుడంటే ఇలాంటి మామగారే కావాలి” అంటూ కొందరు సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు భారతీయ సంప్రదాయాల్లో బంధాలకు ఇచ్చే విలువకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయం, విలాసం, కుటుంబ అనుబంధం కలిసిన ఈ ప్రత్యేక కానుక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ALSO READ: వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎందుకు బెస్ట్..?