క్రైమ్ మిర్రర్ : కోనసీమ జిల్లాలో కల్తీ పనీర్ వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. నాణ్యత లేని పనీర్ వినియోగం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో కల్తీ పనీర్కు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అమలాపురం పరిధిలో అధికారులు చేపట్టిన సాధారణ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న పనీర్ను గుర్తించారు. అనంతరం వాటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ల్యాబ్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఆ పనీర్ నాణ్యతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు రావులపాలెం ప్రాంతంలో ఓ కుటుంబం స్థానిక హోటల్లో పనీర్తో తయారు చేసిన వంటకాలను తిన్న అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు విరేచనాలు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. హోటల్లో ఉపయోగించిన పనీర్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో రోజువారీగా సుమారు 750 కిలోల వరకు పనీర్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇందులో నాణ్యమైన, స్వచ్ఛమైన పనీర్ వాటా కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. కల్తీ పనీర్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
also read : విమానంలో దుస్తులు విప్పి మహిళ హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు
