తమిళనాడులోని సేలం జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. అరిసిపాలయం ప్రాంతంలోని ఓ ఇంటి వాటర్ ట్యాంక్లో గుర్తుతెలియని మహిళకు చెందిన శరీర భాగాలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇంటి కుళాయి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని వాటర్ ట్యాంక్ను పరిశీలించాడు. ట్యాంక్లో మూడు సంచులు కనిపించడంతో వాటిని బయటకు తీసి చూడగా.. అందులో మహిళకు చెందిన చేతులు, కాళ్లు, మొండెం, తుంటి తదితర శరీర భాగాలు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు సంచుల్లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి సంచుల్లో పెట్టి వాటర్ ట్యాంక్లో పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలి చేతిపై ఉన్న ‘గణపతి’ అనే పచ్చబొట్టు ఆధారంగా ఆమె వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? హత్యకు గల కారణం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అరిసిపాలయం ప్రాంతంలో భయాందోళన నెలకొంది.
also read: నెల్లూరులో రౌడీషీటర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 24 గంటల్లోనే 8 మంది అరెస్ట్
