రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. రష్యా సైన్యంలో మొత్తం 227 మంది భారతీయులు చేరినట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
మరో 139 మంది భారతీయులు రష్యా సైన్యం నుంచి బయటకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన భారతీయులను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రష్యా అధికారులతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
ఈ వ్యవహారంలో భారత రాయబార కార్యాలయం కీలకంగా వ్యవహరిస్తోందని విక్రమ్ మిశ్రీ చెప్పారు. రష్యా అధికారులతో సమన్వయం చేసుకుంటూ మిగిలిన భారతీయుల విడుదల, స్వదేశానికి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పలువురు భారతీయులు రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా లేదా ఇతర విధుల్లో చేరిన విషయం తెలిసిందే. వారిని తిరిగి భారత్కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
also read: సేలంలో దారుణం.. వాటర్ ట్యాంక్లో మహిళ శరీర భాగాలు
