కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ చుట్టూ కొనసాగుతున్న నెగెటివ్ ప్రచారంపై ఆయన తల్లి పుష్ప స్పందించారు. తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేని కొందరు కావాలనే తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యశ్ను తీవ్రవాదిగా పోలుస్తూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
యశ్ గురించి మాట్లాడిన పుష్ప.. తన కుమారుడు కర్ణాటకలోనే పుట్టి పెరిగాడని, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన ప్రతిభతో ఎదుగుతుంటే అందుకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. యశ్పై వస్తున్న విమర్శలు, ప్రచారం తనను బాధిస్తున్నాయని ఆమె అన్నారు.
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్త గుర్తింపు
యశ్కు ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు వచ్చినప్పటికీ.. అంతకుముందే కన్నడ చిత్ర పరిశ్రమలో ఆయనకు మంచి క్రేజ్ ఉందని పుష్ప గుర్తుచేశారు. ఎన్నో విజయవంతమైన కన్నడ సినిమాల్లో నటించి యశ్ ఇప్పటికే అక్కడ స్టార్ హీరోగా ఎదిగాడని చెప్పారు.
గతంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన ‘కేజీఎఫ్కు ముందు యశ్ను పెద్దగా ఎవరూ గుర్తించలేదు’ అనే వ్యాఖ్యల నేపథ్యంలో పుష్ప చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆమె ఎవరినీ నేరుగా ప్రస్తావించకుండా.. యశ్ సినీ ప్రయాణాన్ని గుర్తుచేశారు.
కుట్రలకు భయపడేది లేదు
తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి ప్రచారం జరిగినా తాము వెనక్కి తగ్గబోమని పుష్ప స్పష్టం చేశారు. యశ్ తన కెరీర్ కోసం ఎంత కష్టపడుతున్నాడో తనకు తెలుసని, అతడి విజయాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ‘టాక్సిక్’పై కొంతకాలంగా సోషల్ మీడియాలో వివిధ రకాల చర్చలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో యశ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
