రాజస్థాన్లోని దౌసా జిల్లాలో వెలుగుచూసిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 22 ఏళ్ల సంగీత హత్య వెనుక ఆమెకు పరిచయమున్న వ్యక్తే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేసును ఛేదించేందుకు పోలీసులు సుమారు 700 కిలోమీటర్ల మేర దర్యాప్తు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సంగీతకు గజేంద్ర మీనా అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉంది. అయితే గజేంద్రకు ఇప్పటికే వివాహం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని సంగీత అతడిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను మెహందీపూర్ బాలాజీ సమీపంలోని కొండ ప్రాంతానికి గజేంద్ర తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
అక్కడ ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో గజేంద్ర సంగీతను గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను గుర్తించకుండా చేసేందుకు ముఖంపై రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
సంగీత మృతదేహం లభించిన తర్వాత పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ సుమారు 700 కిలోమీటర్ల మేర ఆధారాలను సేకరించారు. చివరకు లభించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గజేంద్ర మీనా ప్రమేయాన్ని గుర్తించారు.
ఈ కేసులో గజేంద్రతో పాటు అతని స్నేహితుడు వివేక్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితులకు మరెవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: విషాదం.. తల్లి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా గుండెపోటుతో కుమారుడి మృతి
