క్రైమ్ మిర్రర్ : నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరో 400 మంది వరకు గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నేపాల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో సరిహద్దు రాష్ట్రాలైన బిహార్, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద నీరు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు.
బిహార్లో అత్యవసర సమావేశం
వరద పరిస్థితిపై బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. డ్యామ్లు, కరకట్టల వద్ద 24 గంటల పాటు నిఘా కొనసాగించాలని సూచించారు. రాత్రి వేళల్లోనూ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు లౌడ్స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అధికారులకు యోగీ కీలక ఆదేశాలు
నేపాల్లో వరదల ప్రభావం నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా అధికారులను అప్రమత్తం చేశారు. గండక్, నారాయణి నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లో వరద ముప్పు ఉండే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించినట్లు బుధవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
also read : కర్ణాటకలో వందేమాతరం రెండు చరణాలే.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
